26-01-2026 11:19:57 AM
రియల్ ఎస్టేట్ వ్యాపారి అలీముద్దీన్పై నాన్ బేలబుల్ వారెంట్!
చేవెళ్ల: అమాయక రైతుల భూములపై కన్నేసి, అక్రమంగా కబ్జాలకు పాల్పడే వారికి కోర్టు గట్టి హెచ్చరిక జారీ చేసింది. చేవెళ్ల సర్వే నంబర్ 79లోని భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ అలీముద్దీన్ పై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు.
అసలు కథ ఇదే!.......
స్థానిక వివరాల ప్రకారం, మహమ్మద్ షఫీయుద్దీన్ అనే వ్యక్తి 2019లో చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలో 1.13 గుంటల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమిపై కన్నేసిన రియల్ వ్యాపారి అలీముద్దీన్, 2021 డిసెంబర్ 22న దాదాపు 20 మంది అనుచరులతో వచ్చి దౌర్జన్యంగా ఒక ఇనుప కంటైనర్ను ఆ పొలంలో దింపాడు. అడ్డుకోబోయిన అగ్రిమెంట్ హోల్డర్లను బెదిరించి వాగ్వాదానికి దిగాడు. దీంతో బాధిత పట్టాదారు షఫీయుద్దీన్ ఫిర్యాదు మేరకు చేవెళ్ల పోలీసులు అప్పట్లోనే కేసు (FIR No. 608/2021) నమోదు చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే నిందితుడు అలీముద్దీన్ విచారణకు హాజరు కాకుండా కోర్టును ధిక్కరిస్తూ వస్తున్నాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన చేవెళ్ల జూనియర్ సివిల్ జడ్జి, ఈ నెల 22న అలీముద్దీన్పై నాన్ బేలబుల్ వారెంట్ (NBW) జారీ చేశారు.
పాత నేరస్థుడేనా?:
అలీముద్దీన్పై కేవలం ఇక్కడే కాకుండా నార్సింగి, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో కూడా పలు కేసులు ఉన్నట్లు నిందితుడు అత్యంత పలుకుబడిన వ్యక్తి కావడంతో, తనకు మరియు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పట్టాదారు షఫీయుద్దీన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఆయన సైబరాబాద్ కమిషనర్కు కూడా ఫిర్యాదు చేశారు. కోర్టు వారెంట్ జారీ చేయడంతో నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.