calender_icon.png 26 July, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినీనటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు

24-07-2025 01:11:07 AM

  1. నిర్మాత విజయ్ చౌదరికి ప్లాటు విక్రయించిన కనకాల

సదరు ప్లాటును మరో వ్యక్తికి  అమ్మిన విజయ్ చౌదరి

సినీ నిర్మాతపై హయత్‌నగర్‌లో కేసు నమోదు

లేని ప్లాటును ఉన్నట్లు చూపి మోసం చేశారని బాధితుల ఆరోపణ

ఎల్బీనగర్, జులై 23(విజయక్రాంతి): ప్రముఖ సినీనటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ కమిషనరేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 421లోని వెంచర్‌లో రాజీవ్ కనకాలకు చెందిన ఓ వివాదాస్పద ప్లాటు నంబర్ 69ని   సినీ నిర్మాత విజయ్ చౌదరికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారు.

విజయ్‌చౌదరి సదరు ప్లాటును ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన శ్రవణ్‌రెడ్డి అనే వ్యక్తికి రూ. 70 లక్షలకు విక్రయించారు. ఏడాది కిందట శ్రవణ్ రెడ్డి తన ప్లాటులో పొజీషన్‌కు వెళ్లగా.. సద రు నంబర్ ప్లాటు లేకుండా మొత్తం ఆనవాళ్లు  చెరిపేశారు. విజయ్‌చౌదరిని శ్రవణ్ రెడ్డి  సంప్రదించగా.. ప్లాట్ ఇవ్వబోనని దాని పై వివాదం నడుస్తోందని, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం అంటూ దాటవేత సమాధానం చెప్పారు.

ఏడాది కాలంగా ఎన్నిసార్లు సంప్రదించినా.. ప్లాటును చూపకపోగా.. సదరు ప్లాటు ఉన్నదని ఒకసారి.. అసలు లేదని ఒకసారి.. మీకు ఇవ్వను అని మరోసారి.. ఇలా కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఇంటికి వెళ్లి నిలదీస్తే మీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతుండడంతో బాధితుడు శ్రవణ్‌రెడ్డి హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యా దు స్వీకరించిన పోలీసులు విజయ్ చౌదరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  దర్యాప్తులో భాగంగా ప్లాటు విక్రయదారు, వెంచర్ భాగస్వామి, సినీ నటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ చేశారు.