10-07-2025 12:00:00 AM
మొత్తం148 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్న టీజీపీఎస్సీ
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): నిరుద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. త్వరలోనే మరో ఉద్యోగ నోటిఫికేషన్ను టీజీపీఎస్సీ వెలువరించనుంది. మొత్తం 148 పోస్టులతో నోటిఫికేషన్ వెలువడనుంది. దీనికి సంబంధించిన కసరత్తును అధికారులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఎప్పుడైనా నోటిఫికేషన్ వేసే వీలుందని పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ఈ పోస్టుల్లో డిప్యూటీఈవో (డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్), డైట్ లెక్చరర్లు, దోమలగూడలోని ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలోని ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)తో పాటు ఎస్సీఈఆర్టీలోని అధ్యాపక పోస్టులను భర్తీ చేయను న్నారు. మొత్తం 148 పోస్టుల్లో 110 వరకు డీప్యూటీఈవో పోస్టులున్నట్లు తెలిసింది.
క్యాబినెట్లో విద్యా అంశాలపై చర్చ
గురువారం జరిగే క్యాబినెట్ భేటీలో విద్యాశాఖకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా కొత్త జిల్లాకు డీఈవో పోస్టుల మంజూరుకు సంబంధించి చర్చించే అవకాశముంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు డీఈవో పోస్టులు లేవు. 33 జిల్లాలకు గానూ 12 డీఈవో పోస్టులే ఉన్నాయి. మరో 21 పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది.
ఉన్న జిల్లాల్లోనూ ఇద్దరు ముగ్గురే రెగ్యులర్ డీఈవోలు న్నారు. మిగతా జిల్లాలకు ఇన్ఛార్జీలే దిక్కు. అలాగే రాష్ట్రంలో కొత్తగా కొన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేశారు. ఆయా కాలేజీల్లో పోస్టులను మంజూరు చే యాల్సి ఉంది. వీటితోపాటు మరికొన్ని అం శాలు సైతం క్యాబినెట్లో చర్చకు వచ్చే అవకాశముందని విద్యావర్గాలు పేర్కొన్నాయి.