4 September, 2026 | 5:05 PM

ఇల్లు కూల్చేస్తామన్న అధికారులు..

05-07-2025 | 12:12am

ఆత్మహత్యాయత్నం చేసిన బాధిత కుటుంబం

కామారెడ్డి,(విజయక్రాంతి): ఇంటిని అక్రమంగా నిర్మించారని అధికారులు కొలతలు తీసుకునేందుకు రాగా.. బాధిత కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఎల్లారెడ్డిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ, బీజేపీ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల నర్సింలు ఇల్లు నిర్మిస్తున్నాడు. అయితే రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారని గుర్తించిన ఎంపీవో ప్రకాష్, పంచాయతీ సెక్రెటరీ ప్రదీప్.. పోలీసు బందోబస్తుతో వచ్చారు. 6 ఫీట్ల మేర రహదారిలోకి ఇల్లు నిర్మాణం వచ్చిందని గుర్తించిన అధికారులు కూల్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో ముగ్గురిని అడ్డుకున్న పోలీసులు పోలీస్​ స్టేషన్​కు తరలించారు. రాజకీయ కక్షల కారణంగా ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం నిబంధనల మేరకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.