10-08-2025 12:57:01 AM
శ్రీ సత్యసాయి నిగమాగమంలో నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 9 (విజయక్రాంతి): పడాల రామారెడ్డి లా కళాశాల 19వ స్నాతకోత్సవాన్ని శనివారం శ్రీ సత్యసాయి నిగమాగమం, హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక కళాశాల స్థాపించి 37 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కళాశాల వ్యవస్థాపకుడు దివంగత పడాల రామారెడ్డి స్మృతికి నివాళిగా జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.
తెలంగాణ రాష్ర్ట ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలాకిష్టరెడ్డి గౌరవ అతిథిగా పాల్గొని, పట్టభద్రులకు వృత్తిపరమైన నీతి నియమాలపై ప్రమాణం చేయించారు. ప్రతిభ కనబరిచిన 42 మంది విద్యార్థులకు జస్టిస్ కె లక్ష్మణ్ బంగారు పతకాలను ప్రదానం చేశారు.
సుమారు 500 మంది ఎల్ఎల్బీ (3-సంవత్సరాలు, 5-సంవత్సరాల ఇంటిగ్రేటెడ్) మరియు ఎల్ఎల్ఎం విద్యార్థులు డిగ్రీలను అందుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణ్ స మగ్రత, న్యాయం, సమాజ సేవ వంటి విలువలపై నొక్కి చెప్పారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పి. విజయ కళ్యాణి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.