15-12-2025 12:00:00 AM
ఎల్బీనగర్, డిసెంబర్ 14 : బహుజనుల గౌరవం, ఆత్మగౌరవం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, ఆయన నేటి యువతరానికి స్ఫూర్తినీయుడని ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గౌడ సంఘం నాయకులు కొనియాడారు. ఎల్బీనగర్ - కామినేని దవాఖాన రోడ్డులో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... బహుజన గౌరవానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. సమాజానికి ఆయన చేసిన త్యాగాలు, సేవలు మరువలేనివని, మహానీయుల చరిత్రను రాబోయే తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ బహుజన చైతన్యానికి, సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కార్యక్రమానికి మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంబాల మల్లేశ్ గౌడ్, మాజీ శాసన మండలి చైర్మన్ కె.స్వామి గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్, గౌడ సంక్షేమ సంఘం ప్రతినిధులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.