15-09-2025 01:10:58 PM
హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్పల్లి పరిధిలోని మేధా పాఠశాల(Medha School)ను సోమవారం విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. పాఠశాల విద్యార్థులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపనున్నట్లు ఎంఈవో హరి చందన్(MEO Hari Chandan) వెల్లడించారు. మేధా పాఠశాల విద్యార్థులను ఇతర పాఠశాలలో చేర్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పాఠశాలలో 63 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మేధా పాఠశాల వద్ద పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల సీజ్ అయిన విషయం తెలియక ఈరోజు విద్యార్థులు బడికి వచ్చారు. పాఠశాల నుంచి పరీక్షలు నిర్వహిస్తారని సందేశం రావడంతో పిల్లలను తల్లిదండ్రులు పాఠశాలకు తీసుకుని వచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మత్తు పదార్థాల తయారీ ఘటనలో మేధా పాఠశాలను నిన్న అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.