04-08-2025 12:05:39 AM
హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ రూపొందించిన తాజాచిత్రం ‘మహావతార్: నరసింహ’. అశ్విన్కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మాతలుగా వ్యవహరించారు. జూలై 25న విడుదలై, అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “మా కుటుంబంలో కానీ, సన్నిహితుల్లో కానీ, పరిచయస్తుల్లో కానీ.. వాళ్లందరిలో సనాతన ధర్మం గురించి పవన్కల్యాణ్కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. పవన్ సనాతన ధర్మం గురించి ప్రసంగిస్తే అందరూ ముగ్ధులవుతాం. ‘మహావతార్: నరసింహ’చిత్రాన్ని ఆయన చూడాలని, దాని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నా” అన్నారు.
ఈ సినిమా ఒక రెవల్యూషన్ కానుంద’ని డైరెక్టర్ అశ్విన్కుమార్ తెలిపారు. ఇది యావత్ భారత్ సినిమా అని ప్రొడ్యూసర్ శిల్పా ధావన్ అన్నారు. రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు మాట్లాడుతూ.. “ప్రస్తుత సమాజానికి ఏం కావాలో అది ఈ సినిమాలో ఉంది.
పురాణాల్లోని కథాంశాన్ని పట్టుకుని దర్శకుడు పరమ అద్భుతంగా చిత్రీకరించాడు” అన్నారు. రచయిత, నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. “దర్శకుడు అశ్విన్ ఈ సినిమాతో యావత్ ప్రపంచానికి విష్ణుమూర్తిని, నరసింహ స్వామిని దర్శనం చేయించేశారు. పరిపూర్ణమైన సినిమా ఇది. ఇది రసాత్మకం, కళాత్మకం” అన్నారు.