18-11-2025 04:02:08 PM
- తప్పనిసరిగా వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలి
- జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లోని వైద్యాధికారులు రోగులకు సేవ దృక్పథంతో మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం బిజినపల్లి మండలంలోని మంగనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. వైద్య సిబ్బంది హాజరు, మందుల కొరత రికార్డ్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిదేనని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం ఏ పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. గర్భిణీలు, పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక శ్రద్ధతో సేవలు అందించాలని, అత్యవసర మందుల నిల్వ, ల్యాబ్ పరీక్షలు, సిబ్బంది డ్యూటీ రోస్టర్ను క్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.