టేకులపల్లిలో ముమ్మరంగా వాహన తనిఖీలు
టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండల కేంద్రమైన బోడు క్రాస్ రోడ్ సెంటర్లో గురువారం పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరంగా నిర్వహించారు. మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సోమవారం నుంచి మొదలు కావడంతో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహన తనిఖీలు చేపట్టారు. ప్రధాన రహదారి అయినా కొత్తగూడెం ఇల్లెందు మార్గమధ్యలో టేకులపల్లి బోడు క్రాస్రోడ్ లో పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.
అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు తమ ఉనికి కోసం ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా కట్టడి చేయాలనే లక్ష్యంతో తనిఖీలు ముమ్మరం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అనుమానితులపైనా పోలీసులు నిఘా పెట్టారు. వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులకు ఆశ్రయం కల్పించవద్దని ప్రజలకు సూచించారు.ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడారు. అపరిచిత వ్యక్తులకు ఎవరూ ఆశ్రయం కల్పించరాదని, అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తున్నట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.






