11-10-2025 01:48:07 AM
జహీరాబాద్, అక్టోబరు 10 :జహీరాబాద్ నియోజకవర్గం మొగడంపల్లి మండలంలోని కాంజా మల్పూర్ (భవనమ్మ పల్లె) లో గల భవాని అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. గురువారం రాత్రి చోరీ జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఆలయం చత్రపతి శివాజీ నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు ఉండడంవల్ల మహారాష్ట్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు.
ప్రతి సంవత్సరం విజయదశమి నుండి వి జయదశమి పూర్తయిన తర్వాత వచ్చే పున్నమి వరకు భక్తులు పాదయాత్రగా వచ్చి కానుకలు సమర్పించుకుంటారు. ఈ సంవత్సరం వచ్చిన ఆదాయాన్ని హుండీలోనే ఉంచి లెక్కించలేదు. దీంతోపాటుగా అమ్మవారిపై ఉన్న వెండి, బంగారు ఆభరణాలను కూడా దొంగలు దోచుకెళ్లారు. అమ్మవారిని నిలువు దోపిడీ చేయడమే కాకుండా భక్తులు సమర్పించిన హుండీని కూడా తీసుకెళ్లి అందులోని డబ్బును తీసుకొని హుండీని నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి వెళ్లారు.
అమ్మవారిని నిలుదోపిడి చేసిన దొంగలను పట్టుకొని శిక్షించాలని భక్తులు కోరుతున్నారు. దొంగతనం జరిగిన విషయాన్ని తెలుసుకున్నఆలయ కమిటీ సభ్యులు చిరగ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిరాకుపల్లి ఎస్ఐ రాజేందర్ రె డ్డి హుటా హుటిన సంఘటన స్థలానికి చేసుకొని విచారణ చేపట్టారు.
శుక్రవారం క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. సీసీ కెమెరాలు పనిచేయక పోవడంతో దొంగలకు సునాయాసమైంది. గత కొంతకాలంగా పూజారులకు ఆలయ కమిటీ సభ్యులకు మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. దీంతో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ మేరకు చిర్గ్ పల్లి ఎస్త్స్ర రాజేందర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.