11-10-2025 02:49:23 PM
కొండచిలువలను పట్టి దూర ప్రాంతంలో వదిలిన
జగదీష్ను సన్మానించిన ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి.
వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వాగుల నుంచి కొండచిలువలు జనావాసాల్లోకి వచ్చాయి. ముఖ్యంగా బైపాస్ రోడ్డు, రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయ సమీపంలో ఈ కొండచిలువలు తిరుగుతుండటంతో స్థానికులు, భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.ప్రజల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన స్థానిక స్నేక్ క్యాచర్ మాదాసు జగదీష్ తన చాకచక్యం, అనుభవంతో ఆ కొండచిలువలను సురక్షితంగా పట్టుకున్నారు. ఎటువంటి హాని జరగకుండా వాటిని దూర ప్రాంతంలోని అడవిలో వదిలిపెట్టి, పట్టణ ప్రజలకు ఉపశమనం కలిగించారు.
మాదాసు జగదీష్ సాహసం, సకాలంలో స్పందించి ప్రజల భయాన్ని పోగొట్టిన తీరును స్థానిక ఏఎస్పీ శేషాద్రి రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాదాసు జగదీష్ను తన కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ప్రకృతి విపత్తుల సమయంలో అడవి జంతువులు జనావాసాల్లోకి రావడం సహజమని, వాటిని హింసించకుండా పట్టుకుని సురక్షితంగా అడవిలో వదిలిపెట్టడం అభినందనీయమని ఈ సందర్భంగా ఏఎస్పీ శేషాద్రి రెడ్డి పేర్కొన్నారు. భయపడకుండా, వన్యప్రాణులకు హాని తలపెట్టకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. మాదాసు జగదీష్ సేవలను స్థానిక ప్రజలు కొనియాడారు.