పెద్దపల్లి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న పోలింగ్
పోలింగ్ కేంద్రాలను తనిఖీలో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి
పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్(Gram Panchayat Elections) ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి(Peddapalli DCP Ram Reddy) తెలిపారు. అంతర్గం మండలం కుందన్ పల్లి పెద్దంపేట్, ఎల్లంపల్లి, మూర్ముర్, గోళీవాడ గ్రామాలలో పోలింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు డీసీపీ వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బంది విధులు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలపై డీసీపీ అధికారులతో సమీక్షించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీసీపీ పిలుపునిచ్చారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితాలు వెల్లడి ముగిసే వరకు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలు కొనసాగుతాయని, శాంతియుత ఎన్నికల నిర్వహణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని డీసీపీ స్పష్టం చేశారు. డీసీపీ వెంట గోదావరిఖని ఏసిపి మడత రమేష్, రామగుండం సిఐ, ఎస్ఐ లు ఉన్నారు.




