13-08-2025 12:00:00 AM
రైతుల కళ్ళలో ఆనందం
తుంగతుర్తి, ఆగస్టు 12 : జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో గడిచిన 10 రోజుల నుండి అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటల్లో కొద్దో, గొప్పో నీళ్లు వచ్చి చేరాయి. సోమవారం రాత్రి 9 గంటలకు మొదలుకొని రాత్రి 2 గంటల వరకు వర్షం ఎడతెరిపి లేకుండా పడడంతో నియోజకవర్గంలోని పలు చెరువులతోపాటు, తుంగతుర్తి మండలంలోని గొట్టిపర్తి వెంపటి, రావులపల్లి, తూర్పు గూడెం, వెలుగుపల్లి పెద్ద చెరువులు ఒక్కసారిగా పూర్తిగా నిండి, అలుగులు పడడంతో ఒక ప్రక్క యువత మరొక ప్రక్క రైతులు అలుగు ప్రదేశాలకు వెళ్లి, నీటిలో కేరింతల కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
దీనితో రైతులు వరి సాగు చేసుకునే అవకాశం ఎక్కువ ఉన్నది. ఈ వర్షం వరితోపాటు, కంది, పత్తి పంటలకు జీవం పోసినట్లు అయిందని, పలువురు రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తూర్పు గూడెం చెరువు గడిచిన 50 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఉధృతంగా ప్రవహిస్తున్నడంతో వాహనదారులకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామాల్లోని ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ తెలియపరిచారు.