22-05-2025 12:14:29 AM
లలితాపురం వద్ద ఛిద్రమై ప్రయాణం ప్రాణసంకటం
ఇల్లెందు టౌన్, మే 21 (విజయక్రాంతి): ఇల్లందు నుంచి ఖమ్మం వెళ్లే మార్గంలోని రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని రోడ్డు ఛిద్రమౌతుంది. రోడ్డు విస్తరణలో భాగంగా సుభాష్ నగర్ కరెంట్ ఆఫీస్ నుంచి లలితాపురం వరకు నాలుగు వరుసల రోడ్డు పనులు చేపట్టారు.
లలితాపురం గ్రామం చివరి నుంచి జిల్లా సరిహద్దు వరకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రోడ్డు గుంతల మాయమై ద్విచక్ర, త్రిచక్ర, వాహనాలతో పాటు కార్లు, లారీలు అక్కడికి రాగానే నానాయాతన పడాల్సి వస్తుంది. రోడ్లు భవనాల శాఖ అధికారులకు పట్టింపు లేకపోవడంతో ప్రయాణీకులకు మరింత ఇబ్బందిగా మారింది. రాత్రివేళ ఆ ప్రాంతంలో ఏ ప్రమాదం జరుగు తుందో అని ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు.
ఇదే మార్గం నుంచి టేకులపల్లి మండలం సింగరేణి కోయగూడెం ఉపరితల గని నుంచి బొగ్గు రవాణాను వందల సంఖ్యలో లారీలు తిరుగుతున్నాయి. అవే కాకుండా ఎక్కువ లోడుతో ఇసుక లారీలు కూడా ప్రయాణిస్తుంటాయి. ఈ ప్రాంతంలో గతంలో అనేక ప్రమాదాలు జరిగిన సంఘటనలున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రోడ్లు భవనాల శాఖాధికారులు తక్షణమే మరమత్తులు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు, ప్రయాణీకులు కోరుతున్నారు.