06-05-2025 12:08:20 AM
జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్
గద్వాల, మే 5 ( విజయక్రాంతి ) : వేసవిలో గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో త్రాగు నీటి అంశంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు కలవకుండా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. వచ్చే నెల రోజులు చాలా కీలకమని అధికారులు అంతా అప్రమత్తంగా ఉంటూ త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు.
స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని నీటి వనరులను గుర్తించి అవసరమైన మరమ్మతులు చేపట్టి ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. వేసవికాలంలో ఎటువంటి త్రాగునీటి ఇబ్బందులు కలుగకుండా మిషన్ భగీరథ అధికారులు,డిపిఓ,ఎంపీడీవోలు సమన్వయంతో పనిచేసి త్రాగునీటి సమస్యను అధిగమించాలని సూచించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఎస్.ఈ వెంకట్ రమణ,ఈ.ఈ (గ్రిడ్) పరమేశ్వరి,ఈ.ఈ (ఇంట్రా) శ్రీధర్ రెడ్డి, తదితరులు, పాల్గొన్నారు.