22-12-2025 10:38:03 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్.ఐ.ఆర్)లో భాగంగా 2025 ఓటర్ జాబితాను 2002 ఎస్ఐఆర్ తో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలసి వీసి లో పాల్గోన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఐఆర్ లో భాగంగా 2002 ఓటర్ జాబితాతో 2025 ఓటర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఎస్.ఐ.ఆర్ 2002 ను ఎస్.ఎస్.ఆర్ 2025 లింకేజీ ప్రక్రియ, అదేవిధంగా 2002 ఓటర్లతో వారి కుటుంబ సభ్యుల లింకేజీ ప్రక్రియ బూత్ స్థాయి అధికారులతో వేగవంతంగా పూర్తి చేయించాలని అన్నారు. వీసీ అనంతరం తహసీల్దార్లతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్.ఐ.ఆర్)లో భాగంగా 2025 ఓటర్ జాబితాను 2002 ఎస్.ఐ.ఆర్ తో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. వనపర్తి లో ఇప్పటివరకు 48.96 శాతమే పూర్తి చేశారని, ప్రక్రియను మరింత వేగవంతం చేసి లక్ష్యాలను సాధించాలన్నారు.
ప్రతిరోజు ప్రతి మండలం నుంచి 100 మందిని మ్యాపింగ్ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ విషయంపై బూత్ స్థాయి అధికారులకు సూచనలు చేయాలని, 10 శాతం కన్నా తక్కువ ఉన్నవారికి షోకాస్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా ఎన్నికల సంఘం ఆదేశించిన ప్రకారం ఓటరు జాబితాలో బ్లర్ గా ఉన్న ఫోటోలను పోలింగ్ కేంద్రాల వారీగా గుర్తించి ఫామ్ 8 ద్వారా ఫోటోలను బిఎల్ఓ లతో అప్డేట్ చేయించే ప్రక్రియను కూడా పూర్తి చేయాలన్నారు. ఈ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో తహసిల్దార్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.