31-10-2025 12:00:00 AM
 
							షాద్ నగర్/ ఆమనగల్లు, అక్టోబర్30 (విజయక్రాంతి): మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి వ్యవసాయ శాఖా అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ధ గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి ఉషా పర్యటించారు. స్థానిక అధికారులతో కలిసి గ్రామంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు.
పలు వురు దెబ్బతిన్న పంటలను చూసి అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికొచ్చే దశలో పంట అంతా వర్షార్పణం అయిందని కళ్ళల్లో నీళ్లు తీసుకున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారి కోరారు. అనంతరం రైతులతో ఆమె మాట్లాడుతూ రైతులు అధైర్య పడకూడదనీ 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టం కల్గితే వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తారని, నష్టపోయిన అన్ని గ్రామాల్లో అన్ని పంటలను పరిశీలించి నివేదిక లను పంపించాలని అధికారులకు ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్, ఫరూక్ నగర్ వ్యవసాయ విస్తరణ అధికారి తేజ్ కుమార్ పాల్గొన్నారు.
అమనగల్ బ్లాక్ మండలాలో...
అమనగల్ బ్లాక్ మండలాలు ఆమనగల్లు, మాడుగుల, తలకొండపల్లి, కడ్తాలలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేశారు. మండలంలో దెబ్బతిన్న పత్తి, వరి పంటల వివరాలను సేకరించారు.ఏవో శ్రీనివాస్ గౌడ్, అరుణ లు మాట్లాడుతూ రైతులు పత్తి పంట లోని వాటర్ ని వెంటనే తొలగించి నీళ్లు నిలువకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈదురుగాలులకు వరి పంట అక్కడక్కడ నేలపై పడిపోయంది అని దీనికి రైతులు ఆందోళన చెందకుండా పడిపోయిన వరి మొదల్లు ను జాగ్రత్తగా పైకి లేపి వాటికి జడలు వేసి నిలబడేటట్టు చేసుకోవాలని రైతులకు సూచించారు. చివరి దశలో ఉన్న వరిపై మొలక, గింజలు రంగు పోకుండా లీటర్ నీటికి 50 గ్రాముల కళ్ళు ఉప్పు కలిపి ఈ పడిపోయిన వరి మొక్కల కంకులపై పడే విధంగా పిచికారి చేయాలన్నారు. మండలంలో దెబ్బ తిన్న పంటల వివరాలను ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు నివేదించినట్లు ఏఓలు పేర్కొన్నారు.