26-01-2026 12:11:15 AM
ఎర్రుపాలెం, జనవరి 25 (విజయక్రాంతి): జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాఘ శుద్ధ సప్తమి. సూర్య జయంతి పర్వదిన శుభ సందర్భంగా నేడు స్వామి వారి ప్రాతః కాల అర్చనలు అనంతరం ఉదయం 10.00 గంటల నుండి లోకబాంధవుడు, ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్య భగవానుని ప్రీతిగా పంచ సూక్తములు మరియు మహా సౌర పఠన తో భక్తులు అందరి సమక్షంలో పొంగలి తయారు చేసి నివేదించటం జరిగినది.
సామూహికముగా భక్తలోక జనక్షేమార్ధం సూర్యభాగవానుని మూలమంత్రం హోమం నిర్వహించిన్నాము. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ మాట్లాడుతూ భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయమునకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘ మాస శుక్ల పక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది.
దీన్నే రథ సప్తమి అని కూడా అంటారు. సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు అని ప్రజలు ప్రతి రోజు సూర్య దేవుని ప్రార్ధించిన వారికి ఆత్మ పీడలు మరియు ఆరోగ్యబాధలు ఉండవని తెలిపారు.
అనంతరం సూర్యప్రభ వాహనంపై గిరి ప్రదక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈకార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కె జగన్ మోహన్ రావ్ దంపతులు మరియు వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ ఉప్పల విజయ దేవశర్మ పర్యవేక్షించగా, అర్చకులు ఉప్పల రాజీవ్ శర్మ దంపతులు పూజలు దేవస్థానం పక్షాన నిర్వహించారు.