15-12-2025 02:15:27 AM
అధికార పార్టీలో కలవరం!
మహబూబాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో రెబల్ అభ్యర్థులు విజయం సాధించి తలనొప్పిగా మారారు. మహబూబాబాద్ జిల్లాలో తొలి విడత నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ భూక్యా ఉమ స్వగ్రామమైన సోమ్లా తండాలో ఎమ్మెల్యే సొంత సోదరుడి భార్య భూక్య కౌసల్యను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీకి నిలపగా, రెబల్ అభ్యర్థిగా లావణ్య పోటీ చేసి విజయం సాధించారు.
ఇదే తరహాలో ఆదివారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి స్వగ్రామమైన చర్లపాలెంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కిరణ్ను పోటీకి నిలపగా, ధర్మారపు మహేందర్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి 82 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.
జిల్లాలోని ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మురళి నాయక్, యశస్విని రెడ్డి స్వగ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచి, ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ రెబల్ అభ్యర్థులు విజయం సాధించడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.