ధాన్యం కొనుగోలులో నిబంధనలు పాటించాలి
జిల్లా అదనపు కలెక్టర్ రాములు
మంచిర్యాల, మే 10 (విజయక్రాంతి) : జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నిబంధనలు పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి రాములు అన్నారు. ఆదివారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలం ఇటిక్యాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల తహసిల్దార్ దిలీప్ కుమార్, మండలవ్యవసాయ అధికారిలతో కలిసి సందర్శించిధాన్యం కొనుగోలులో నెలకొన్న సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి మద్దతు ధర చెల్లించి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు.
రైతుల వద్ద గల ధాన్యంను నిబంధనల ప్రకారం పరిశీలించి కొనుగోలు చేయాలని, కొనుగోలు అనంతరం గోదాములకు, రైస్ మిల్లులకు తరలింపు ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో మండల తహసిల్దార్ దిలీప్ కుమార్, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ లతో కలిసి మండలంలోని కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్ అంశాలపై సమీక్షించారు.
అకాల వర్షాల కారణంగా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని తడవకుండా రైతుల సంక్షేమం లో భాగంగా గోదాములలో నిలువ చేయడం జరుగుతుందని, లారీలు, అందుబాటులో ఉన్న ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, గోదాముల సామర్థ్యం, హమాలీల సంఖ్యను పూర్తిగా వినియోగిస్తూ నిల్వలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలని తెలిపారు.
కొనుగోలు ప్రక్రియలో రైస్ మిల్లులు, లారీలు, హమాలీలు, కొనుగోలు కేంద్రాలలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగాఉన్నామని తెలిపారు. అనంతరం జైపూర్ మండలం ఇందారం, రామారావుపేట లోని సుముఖ గోదామును కార్మిక శాఖ సహాయ కమీషనర్ తో కలిసి సందర్శించి మిల్లర్, గోదాము నిర్వాహకులతో మాట్లాడి ధాన్యం దిగుమతిపై పలు సూచనలు చేశారు. జిల్లాలో 12 రైస్ మిల్లులు పని చేస్తున్నాయని, కొనుగోలు కేంద్రాల నుండి కేటాయించిన ప్రకారం వచ్చిన లారీల నుండి ధాన్యం దిగుమతి చేసుకోవాలని తెలిపారు.
ఈ నెల చివరి వరకు వీలైనంత ధాన్యం కొనుగోలు చేయాలని, 80 శాతం దాన్యం కొనుగోలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మిల్లింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, రవాణా వాహనాలను మిల్లులకు తగిన విధంగా కేటాయించి, వరి ధాన్యం రవాణా, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.






