24-07-2024 01:49:14 AM
న్యూఢిల్లీ, జూలై 23: వేతన జీవులు, మధ్య తరగతి ప్రజలకు ఊరట కల్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయ పన్ను విధానంలో కీలక మార్పులు చేశారు. పన్ను స్లాబులతో పాటు స్టాండర్డ్ డిడక్షన్లోనూ ఊరట కల్పించారు. ప్రస్తుతం ప్రామాణిక తగ్గింపు రూ.50 వేలు ఉండగా దాన్ని 50 శాతం పెంచుతూ రూ.75 వేలకు పెంచారు.
దీనివల్ల ట్యాక్స్ పేయర్స్కు ఏటా రూ.17,500 వరకు ప్రయోజనం చేకూరుతుందని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే, పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులూ చేయలేదని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా పింఛనుదారులకు కుటుంబ పెన్షన్పై మినహాయింపును రూ.15 వేలకు నుంచి రూ.25 వేలకు పెంచాలని ప్రతిపాదించారు. దీని వల్ల నాలుగు కోట్ల మంది వేతన జీవులు, పెన్షనర్లకు ఊరట కల్పిస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
విదేశాల్లో చరాస్తులపై కీలక నిర్ణయం
2023 ఆర్థిక సంవత్సరంలో మూడింట రెండొంతుల మంది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారని ఆమె చెప్పారు. ఆ ఏడాది ఏకంగా రూ.8.61 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలైనట్లు తెలిపారు. స్టార్టప్లు, ఆవిష్కరణల ప్రోత్సాహాకానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని తరగతుల పెట్టుబడిదారులపై ఏంజెల్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్కు విదేశాల్లో ఉన్న చరాస్తులపై సమా చారం ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని సీతారామన్ స్పష్టం చేశారు.
సరళంగా ఐటీ యాక్ట్
ఆదాయపు పన్ను చట్టం సులభంగా అర్థమయ్యేలా సమీ క్షిస్తామని కేంద్రం ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. బడ్జెట్ ప్రకటన లోనూ టీడీఎస్ డిపాల్టర్ల కోసం ప్రమాణిక ఆపరేటింగ్ విధానాన్ని అమలు చేసి, ఎలాంటి తప్పిదాలు జరగకుండా ప్రక్రియను హేతుబద్ధంగా ఉండేలా సులభ తరం చేస్తామన్నారు. క్రెడిట్, ఈ విద్య, ఆరోగ్యం, ఎంఎస్ఎంఈ సేవల డెలివరీ, అర్బన్ గవర్నెన్స్ కోసం డీపీఐ యాప్లను అభివృద్ధి చేయనున్నట్లు నిర్మల ప్రకటించారు.
