13-06-2025 12:29:26 AM
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): గత కొన్ని నెలలుగా గురుకులాల ప్రైవేట్ భవనాల యజమానులకు రావాల్సిన అద్దె బకాయిలను ప్రభుత్వం ఎట్టకేలకు చెల్లించింది. అద్దె బకాయిలు చెల్లించకుంటే జూన్ 12నుంచి భవనాలకు తాళాలు వేస్తామని గురుకుల విద్యాలయ ప్రైవేట్ భవన యాజమానుల సంఘం ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే దిగొచ్చింది.
జూన్ 11 రాత్రి కొన్ని పెండింగ్ బకాయిలను మంజూ రు చేసింది. మిగిలిన బకాయిలను అతిత్వరలోనే చెల్లిస్తామని యాజమాన్యాలకు ప్రభుత్వం భరోసా ఇవ్వడంతో గురువారం గురుకులాలు తెరుచుకున్నాయి. మైనార్టీ గురుకులాలు మినహా మిగతా సొసైటీ గురుకులాలన్నీ తెరుచుకున్నాయి.
హైదరాబాద్లోని ముషీరాబాద్ బాగ్లింగంపల్లిలోని మైనారిటీ గురుకులానికి తాళాలు పడినట్లు సమా చారం. దీంతో టీచర్లు, విద్యార్థులు రోడ్డుమీదనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. తమకు పెండింగ్లోని మొత్తం బకాయిలు ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల ఆయా భవనాల యజామాన్యాలు ఈ నిర్ణ యం తీసుకున్నట్లు తెలిసింది.
రూ.62 కోట్లు విడుదల..
ప్రభుత్వ గురుకుల విద్యాలయ ప్రైవేట్ భవన యాజమాన్య సంఘం చెప్తున్న ప్రకా రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలకు దాదాపు రూ.200కోట్లకుపైగా బకా యిలు పెండింగ్లో ఉండేవి. అయితే ఇందు లో రూ.62 కోట్లను బుధవారం రాత్రి ప్రభు త్వం విడుదల చేసింది. ఎస్సీ గురుకులాలకు రావాల్సిన 12 నెలల బకాయిల్లో 9 నెలల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది.
బీసీ గురుకులాలకు 10 నెలలకు గానూ నాలుగు నెలల బకాయిలు విడుదల చేయ గా, ఎస్టీ గురుకులాలకు పెండింగ్ బకాయిలను చెల్లించలేదని యాజమాన్య సంఘాల నేతలు పేర్కొన్నారు. ఎస్టీ గురుకులాలకు దాదాపు 10నెలల అద్దె బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక మైనార్టీ గురుకులాల 12 నెలల అద్దె బకాయిలకు గానూ ప్రభుత్వం కేవలం మూడు నెలలకే నిధులను విడుదల చేయడంతో ఆయా భవన యాజమాన్యాలు ఒప్పుకోలేదు.
ఒకేసారి చెల్లించాలంటూ రా ష్ట్రంలో పలుచోట్ల మైనారిటీ గురుకులాలకు తాళాలు వేశారు. గురుకులాల అద్దె నెలకు సగటున రూ.లక్షన్నర నుంచి రూ.4లక్షల వరకు ఉంటుంది. ఒక చదరపు అడుగుకు 7 రూపాయల నుంచి రూ.20వరకు అద్దెను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇదిలా ఉంటే మరికొన్ని సంక్షేమ హాస్టళ్ల భవనాల అద్దె బకా యిలు ఏడాది నుంచి పెండింగ్లోనే ఉన్నా యి. వాటిని కూడా విడుదల చేయాలని భవ న యాజమానులు డిమాండ్ చేస్తున్నారు.
అందరికీ ఒకేలా అద్దెలు చెల్లించాలి: దేవేందర్రెడ్డి,
రాష్ట్ర అధ్యక్షుడు, ప్రైవేట్ భవన యాజమానుల సంఘం
ప్రభుత్వం నిధులను విడుదల చేసింది కానీ, ఇంకా మా ఖాతాల్లో జమ కాలేదు. సో మవారం వరకు వేచిచూస్తాం. ఒకవేళ జమ కాకుంటే తాళాలు వేస్తాం. ఎస్సీ గురుకులాలకు నేరుగా గ్రీన్ఛానల్ ద్వారా భవన య జమానుల ఖాతాల్లో పడుతున్నాయి. కా నీ బీసీ గురుకులాలకు నేరుగా పడటంలేదు.
మరోవైపు 2018నుంచి పాత అద్దె విధానమే కొనసాగుతోంది. పాతవారికేమో ఒక చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ)కు ఏడు నుంచి పది రూపాయలు చెల్లిస్తుంటే, కొత్తవారికేమో రూ.20 రూపాలు చెల్లిస్తుండటం దా రుణం. గ్రామీణప్రాంతాల్లో ఎస్ఎఫ్టీకు రూ.15, జిల్లా కేంద్రాల్లో రూ.25 అద్దెను ఫిక్స్ చేయాలి.