30-04-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): త్వరలో బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు అమలు చేసుకోబోతున్నామని బీసీ సంక్షేమ శాఖ , హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం అంబర్పేట చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని గవర్నర్ ఆమోదించారని, ఈ నెల 8న రాష్ట్రపతికి పంపారని తెలిపారు. ఏప్రిల్ నెల మహనీయుల నెల అని అంబేడ్కర్, జ్యోతిరావు పూలేల జయంతిలు ఈ నెలలో ఉన్నాయన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తిని ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ ముందుకు తీసుకెళుతున్నారన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ రక్షణకు అంతా కలిసి పని చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహనుమంతరావు, ఏఐసీసీ సెక్రటరీలు విశ్వనాథ్, విష్ణునాథ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.