18-10-2025 04:19:16 PM
బందుకు మద్దతు ప్రకటించిన మంత్రి వివేక్
మందమర్రి,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు పట్టణంలో శనివారం విజయవంతం అయింది. వర్తక వాణిజ్య సంస్థలు స్వచ్ఛందం గా మూసివేశారు. పెట్రోల్ బంకులు, బ్యాంకులు బందులో పాల్గొనగా విద్యాసంస్థలు ముందస్తుగా సెలవులు ప్రకటించాయి. బంద్ సందర్భంగా జనజీవనం పూర్తిగా స్తంభించి పోయింది.ఆర్టీసీ బస్సులు,ఆటోలు, ప్రైవేట్ వాహనాలు బంద్ కు మద్దతు ప్రకటించడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంద్ ను పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
బంద్ కు మంత్రి మద్దతు
రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపుకు రాష్ట్ర కార్మిక, గనుల శాఖా మంత్రి వివేక్ వెంకటస్వామి మద్దతు ప్రకటించారు. పట్టణంలోనీ మార్కెట్ ఏరియాలో బంద్ ను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు బంద్ లో పాల్గొన్నాయన్నారు.
రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం, రాహుల్ గాంధీ, రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేయగా బీసీ రిజర్వేషన్లు క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి వస్తుందని దురుద్దేశంతో బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు బీసీ రిజర్వేషన్లకు అడ్డు తగులుతున్నాయని ఆయన ఆరోపించారు. వెంటనే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు అమలు చేసేలా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.