06-11-2025 10:20:07 PM
కలెక్టర్ ఇలా త్రిపాఠి
చిట్యాల (విజయక్రాంతి): ఈ వానకాలం సీజన్లో పండించిన ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, వట్టిమర్తి గ్రామంలో ఉన్న సిద్ధార్థ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్ కు వచ్చే దాన్యం వివరాలను పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని లారీలు వచ్చాయని? తేమశాతం, ఇతర నాణ్యత ప్రమాణాల వివరాలను యాజమాన్యం ద్వారా అడిగి తెలుసుకున్నారు.
వర్షాల కారణంగా గడిచిన వారం, పది రోజుల్లో ధాన్యం రైస్ మిల్లులకు రాలేదని, ప్రస్తుతం వర్షాలు లేనందున, తెరిపి ఇచ్చినందున మిల్లులకు దాన్యం వస్తున్నదని ,అందువల్ల వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లు ఆన్ లోడ్ చేసుకునే విధంగా రైస్ మిల్లర్లు సహకరించాలని కోరారు.ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, ముఖ్యంగా స్థలం, హమాలీలను సంసిద్ధంగా ఉంచుకొన్నట్లైతే తెచ్చిన ధాన్యాన్ని తక్షణమే మిల్లులలో దించుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ధాన్యాన్ని దించుకోవడంలో ఆలస్యం చేయవద్దని, ఒకవేళ వర్షం వస్తే మళ్ళీ తడిచిపోయేందుకు అవకాశం ఉందని ఆమె తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేష్ ,పారసరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, తదితరులు పాల్గొన్నారు