09-07-2025 12:56:38 AM
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
ఖమ్మం, జూలై 8 (విజయక్రాంతి): నగరంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.మంత్రి, మంగళవారం ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ పరిధి 15వ డివిజన్ లో మునిసిపల్ సాధారణ నిధులు రూ. 23.75 లక్షలతో కాకతీయ హిల్స్ నుండి మెయిన్ రోడ్డు వరకు నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు, రూ. 24.5 లక్షలతో జిఆర్ఆర్ శ్రీనివాసం నుండి పుట్టకోట బి.టి. రోడ్డు వరకు నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో సకాలం లో పూర్తి చేయాలని తెలిపారు. ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా తమ వంతు సహకారం అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మొక్కలు పెద్ద ఎత్తున నాటి, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
కాలనీలో ఉన్న నీటి సరఫరా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, 15వ డివిజన్ కార్పొరేటర్ రావూరి కరుణ సైదుబాబు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, ఖమ్మం అర్బన్ తహసిల్దార్ సైదులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.