calender_icon.png 9 July, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సకాలంలో యూరియా సరఫరా చేయండి

09-07-2025 12:56:12 AM

  1. ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడండి 
  2. తెలంగాణకు దేశీయ యూరియా కోటా పెంచండి
  3. కేంద్రమంత్రి నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్ట అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రిని ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి మంగళ వారం కలిశారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి ఏప్రిల్-, జూన్ నెలల మధ్య 5 లక్షల టన్నులకుగానూ కేవలం 3.07 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేశారని కేంద్రమంత్రి నడ్డా దృష్టికి సీఎం రేవంత్‌రెడ్డి తీసుకెళ్లారు.

రాష్ర్టంలో ప్రాజెక్టులకు నీరు రావడం.. సాగు పనులు జోరుగా సాగుతున్నందున యూరియా సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా చూడాలని కోరారు. జూలై నెలకు సంబంధించి 63 వేల టన్నులు దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా, 97 వేల టన్నులు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 29 వేల టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేశారని కేంద్రమంత్రికి సీఎం తెలిపారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను తెలంగాణకు పెంచాలని కోరారు.

యూరియా సరఫరాకు సంబంధించి రైల్వేశాఖ తగిన రేక్‌లు కేటాయించడం లేదని,  వాటి సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ర్ట ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, రాష్ర్ట వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించండి

  1. వరంగల్ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయాలి
  2. ఏరో-డిఫెన్స్ కారిడార్ మంజూరు చేయండి
  3. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు సీఎం రేవంత్ వినతి

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల అభివృద్ధికి సహా యం చేయాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించాలని కేం ద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు సీఎం ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని వాణిజ్య భవన్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా పలు అంశాలను సీఎం ప్రస్తావించారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అమలు ట్రస్ట్ (ఎన్‌ఐసీడీఐటీ) ఆమోదించిన రూ.596.61 కోట్లను త్వరగా విడుదల చేయాలని సీఎం కోరారు. స్మార్ట్ సిటీకి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్, ఇతర వసతుల కల్పనకు ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్--వరంగల్ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా వరంగల్ విమానాశ్రయానికి నిధు లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం అభ్యర్థించారు. హైదరాబాద్--విజయవాడ పారిశ్రామిక కారిడార్ ఫీజుబిలిటీని అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి దృష్టి కి సీఎం తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం ఆదిభట్లలో అత్యున్నతమైన మౌలిక వసతులతో ప్రత్యేకమైన రక్షణ, ఏరోస్పేస్ పార్కును ఏర్పాటు చేసిందని.

ఈ నేపథ్యంలో హైదరాబాద్--బెంగళూర్ పారిశ్రామిక కారిడార్‌ను ఏరో--డిఫెన్స్ కారిడార్‌గా మంజూరు చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న వంద ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పిస్తామని, కేంద్ర ప్రభుత్వం వాటికి మద్దతుగా నిలవాలని కోరారు.

సమావేశంలో రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు సక్రీడలు) ఏపీ జితేందర్ రెడ్డి, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.