30-10-2025 12:45:52 AM
సదాశివపేటకు రూ.18.70 కోట్లు మంజూరు
టీపీసీసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి, అక్టోబర్ 29(విజయక్రాంతి):సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ.37.40 కోట్ల నిధులు మంజూరైనట్లు టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఒక్కో మున్సిపాలిటీకి రూ.18.70 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలలో పలు అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఈ నిధులు మంజూరు చేయించినట్లు వారు తెలిపారు.
అభివృద్ధి పనులకు సంబంధించి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవల్మెంట్ ఫండ్ కింద నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం మంగళవారం జి.ఓ విడుదల చేసిందన్నారు. ఇందులో సదాశివపేట మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, సెంట్రల్ మీడియం, సెంట్రల్ లైటింగ్, డబుల్ బెడ్ రూంల వద్ద కనీస సౌకర్యాలు, హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు, గురు నగర్ కాలనీలో పార్క్ డెవల్మెంట్ కోసం రూ.18.70 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
అలాగే సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో విలీన గ్రామాల్లో సి సి రోడ్లు, ఇంటర్నల్ సీసీ రోడ్లు, వరద నీరు మళ్లింపు కోసం ప్రత్యేక డ్రైన్ నిర్మాణం, పార్కుల అభివృద్ధికి, పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం రూ.18.70 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వారు తెలిపారు.