24-01-2026 12:57:24 AM
ముంబై, జనవరి 23: దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి భారీ నష్టాలను చవిచూసింది. రూ.6లక్షల కోట్ల సంపద ఆవిరైంది. అంతర్జాతీయ అనిశ్చితి, నిరుత్సాహకరమైన త్రైమాసిక ఫలితాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలూ తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఉదయం లాభాల్లో ఉన్న సూచీలు మధ్యాహ్నం నుంచి భారీ నష్టాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ ఓ దశలో 800 పాయింట్ల మేర పతనమైంది. నిఫ్టీ 25,050 దిగువకు చేరింది.
దీంతో గురువారం లాభాల సంబరం ఒక్కరోజుకే ఆవిరైంది. మదుపర్ల సంపద రూ.6లక్షల కోట్ల మేర ఆవిరైంది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.452 కోట్లకు చేరింది. డాలరుతో రూపాయి మారకం విలువ 91.93 వద్ద మరోసారి ఆల్టైమ్ కనిష్ఠానికి చేరింది.
సెన్సెక్స్ 30 సూచీలో ఆదానీ పోర్ట్స్, ఎటెర్నల్, ఇండిగో, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ పిన్సర్వ్ షేర్లు ముఖ్యంగా నష్టపోయాయి. హిందుస్థాన్ యూనిలీవర్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 64.79 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్స్ 4926 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.