18-10-2025 01:32:41 AM
ప్రకటించిన టీఎంయూ, ఎన్ఎంయూ నేతలు
హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ రాష్ర్ట వ్యాప్తంగా బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు నేటి బంద్కు ఆర్టీసీ యూనియన్ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ మేరకు తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు శుక్రవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. బీసీల హక్కుల సాధన కోసం జరుగుతున్న ఈ పోరాటానికి తమ పూర్తి మద్దతు తెలుపుతూ, ఆర్టీసీ కార్మికులు బంద్లో చురుకుగా పాల్గొనాలని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి పిలుపునిచ్చారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రెసిడెంట్ పీ కమల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మర్రి నరేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణ బందుకు తమ యూనియన్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ర్ట కమిటీ నిర్ణయించిందని పేర్కొన్నారు. శనివారం తలపెట్టిన బందులో ఆర్టీసీ కార్మికులు పూర్తిస్థాయిలో పాల్గొని బీసీ రిజర్వేషన్లకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.