calender_icon.png 20 August, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లకు ఇక సులభంగా ఇసుక సరఫరా

20-08-2025 01:14:12 AM

టీజీఎండీసీ ఆధ్వర్యంలో సాండ్ బజార్ ప్రారంభం

హనుమకొండ టౌన్, అగస్టు 19 (విజయక్రాంతి) : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక సులభతరంగా, ఆర్థిక భారాన్ని తగ్గించి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీజీఎండిసి ఆధ్వర్యంలో సాండ్ బజార్ ను ఏర్పాటు చేసిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

మంగళవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్లలో  నూతనంగా ఏర్పాటు చేసిన సాండ్ బజార్ ను ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కే.ఆర్ నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, టిజిఎండిసి అధికారులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సాండ్ బజార్ లో అందుబాటులో ఉన్న నాణ్యమైన ఇసుకను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సాండ్ బజార్ లో లభించే ఇసుకను తీసుకోవడానికి ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని, ఆన్లైన్లో బుక్  చేసుకునే పరిస్థితి లేని వారికి సిబ్బంది ఆన్లైన్లో ఇసుక బుకింగ్ చేసి అందించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు తక్కువ ధరలో సాండ్ బజార్ లో ఇసుక లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

నాణ్యమైన ఇసుకను అందించే సాండ్ బజార్  ఏర్పాటుతో  పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎండిసి నోడల్ అధికారి శ్రీనివాస్, పిడి హౌసింగ్ సిద్ధార్థ నాయక్, హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి ప్రాజెక్ట్ అధికారులు విష్ణువర్ధన్, వినయ్, రాజు, స్థానిక తహసిల్దార్ సదానందం తదితరులు పాల్గొన్నారు.