20-08-2025 09:56:16 PM
23న హైదరాబాద్ లో మహాధర్నా
యుయస్పిసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు
చకినాల అనిల్ కుమార్
కామారెడ్డి,(విజయక్రాంతి): ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పిసీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు యుయస్పిసి స్టీరింగ్ కమిటీ సభ్యులు సకినాల అనిల్ కుమార్ తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో యుయస్పిసి స్టీరింగ్ కమిటి నాయకులు మాట్లాడుతూ... ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినప్పటికి ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తుందన్నారు.
మేనిఫెస్టోలో పొందుపరచిన ఎన్నికల హామీలను అమలు పరచడం లేదు. నూతన జిల్లాలకు డిఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు యంఈఓ పోస్టులను మంజూరు చేసి, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ను రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయలన్నారు. ఉపాధ్యాయుల పెన్షనర్ల, వివిధ రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. ప్రాథమిక పాఠశాలలకు 5571 పియస్ హెచ్యం పోస్టులను మంజూరు చేయాలని, డిఎడ్, బిఎడ్ అర్హతలున్నప్రతి యస్జిటికి పియస్హెచ్యం ప్రమోషన్కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
పండిట్, పిఈటిల అప్ గ్రేడేషన్ ప్రక్రియ పూర్తి అయినందున జిఒ 2,3,9,10 లను రద్దు చేసి జిఒ 11,12 ల ప్రకారం పదోన్నతులు కల్పించాలని, ఉపాధ్యాయుల సర్దుబాటు మార్గదర్శకాలను సవరించాలని, వివిధ జిల్లాల్లో జరిగిన పైరవీ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని, గురుకుల టైం టేబుల్ సవరించాలని, కెజిబివి, మోడల్ స్కూల్స్, గిరిజన సంక్షేమ, ఎయిడెడ్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పై సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి అనేక మార్లు ప్రాతినిధ్యం చేసినప్పటికి మంత్రులు, ఆఫీసర్ల కమిటీలు వేసినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో గత నెలలో దశలవారీ ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని యుయస్పిసి నిర్ణయించిందన్నారు.
జులై 23, 24, 25 తేదీలలో మండల తహసీల్దార్ల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మెమోరాండాలు సమర్పించామని, రెండవ దశలో ఆగస్టు 5న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి జిల్లా కలెక్టర్ ద్వారా వినతిపత్రాలు అందజేశామని అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. అనివార్యంగా 23న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.