15-05-2025 08:14:03 AM
హైదరాబాద్: భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారికంగా ప్రారంభించారు. త్రివేణి సంగమంలో మధనానంద సరస్వతి స్వామి తొలి స్నానం ఆచరించారు. సరస్వతి పుష్కరిని వద్ద మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. పుణ్య స్నానాల కోసం భక్తులు భారీగా కాళేశ్వరానికి చేరుకున్నారు. నేటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు సరస్వతి నది పుష్కరాలు కొనసాగనున్నాయి.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత సరస్వతి పుష్కరాలు తొలిసారి జరుగుతున్నాయి. సరస్వతి పుష్కరాల కోసం రూ. 35 కోట్లతో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతి విగ్రహం ఏర్పాటుకు నిర్ణయించారు. 12 రోజుల పాటు త్రివేణి సంగమంలో కాశీ పండితులతో గోదావరికి హారతి ఇవ్వనున్నారు. రోజూ ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు యాగాలు చేయనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6.45 నుంచి 7.35 వరకు సరస్వతి నవరత్న మాల హారతి ఇవ్వనున్నారు. ప్రతిరోజూ రాత్రి కళ, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన చేపట్టనున్నారు. సరస్వతి పుష్కరాలకు 3500 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.