31-10-2025 06:55:42 PM
 
							కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,(విజయక్రాంతి): దేశ ప్రజలందరినీ ఏకతాటి పైకి తీసుకువచ్చి జాతీయ సమైక్యతకు నిదర్శనంగా నిలిచిన మహనీయుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి ఐబి చౌరస్తా వరకు నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ 2కె రన్ కార్యక్రమాన్ని డిసిపి ఎగ్గడి భాస్కర్, మంచిర్యాల ఎసిపి ప్రకాష్, జిల్లా క్రీడా యువజన సర్వీసుల అధికారి హనుమంతరావు లతో కలిసి ప్రారంభించి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ ప్రజలందరినీ ఐక్యం చేస్తూ జాతీయ సమైక్యతకు కృషి చేసిన మహనీయుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ అని అన్నారు. కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంతీయ, సాంస్కృతిక విభేదాలు లేకుండా ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారని, భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రిగా దేశానికి విశిష్ట సేవలు అందించారని తెలిపారు. దాదాపు 530 రాష్ట్రాలను భారతదేశంలో విలీనం చేశారని, పౌర హక్కులు, రైతు ప్రయోజనాల కోసం కృషి చేశారని తెలిపారు. ప్రజలందరూ ఐక్యతతో ముందుకు సాగితే రాష్ట్రం, దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని, దేశభక్తి, సమైక్యత భావం ప్రతి ఒక్కరిలో ఉండాలని తెలిపారు. ప్రజల సంక్షేమం, దేశ అభివృద్ధికి కృషిచేసిన మహనీయుల ఆశయాలను యువత సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు.