16-08-2025 12:29:38 AM
ప్రముఖ ఆర్కిటెక్ట్ మురళితో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు,ఆగస్టు 15 (విజయ క్రాంతి): నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల్లో సమృద్ధిగా కల్పించి పాఠశాలల భవనాలను చూస్తే దేవాలయాలుగా ఉండాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ మురళితో కలిసి మండల కేంద్రాలలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి పరిశీలించారు.
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల ను బలోపేతం చేయడానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతి ఇస్తూ ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తున్నారు. మరో అడుగు ముందుకు వేసి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టి ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలలు వసతి గృహాల పైన పలుమార్లు సమీక్షలు నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలంటే మౌలిక సదుపాయాల కల్పన తప్పనిసరి అని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 43 క్లస్టర్ పాఠశాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించి,మొదటగా ప్రతి పాఠశాలను సర్వే చేయించి టెన్ ప్లస్ టు కి సరిపడా మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయాలని, పాఠశాల భవనాలను చూస్తే దేవాలయాలు గా ఉండాలని,
మండల కేంద్రాలలో నిర్మించే క్లస్టర్ పాఠశాల ట్రెడిషనల్ హిస్టారికల్ భవనాల లాగా ఉండేలా ప్రణాళికలు రూపొందించబోతున్నామన్నారు. ఈ క్లస్టర్ పాఠశాలల్లో సహజ వెలుతురు ఉండేలా, మెయింటెనెన్స్ ఫ్రీ ఉండేలా నిర్మాణాలు ఉంటాయని అన్నారు.వాస్తు ప్రకారం నిర్మించే ఈ భవనాలలోకి వస్తే దేవాలయాలలోకి వచ్చే ఫీలింగ్ కలగాలని అభిప్రాయపడ్డారు.పాఠశాలను పరిశీలించిన వారిలో స్థానిక నాయకులు ఉన్నారు.