12-12-2025 06:22:20 PM
స్వచ్ఛ ఏవం యు హరిత రేటింగ్ కు 8 పాఠశాలలు ఎంపిక
కరీంనగర్,(విజయక్రాంతి): స్వచ్ఛ ఏవంయు హరిత విద్యాలయ రేటింగ్ లో జిల్లా నుండి 8 పాఠశాలలు రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యాయి. ఈ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాధికారి అశ్విని తానాజీ వాకడే అభినందించారు. ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో జిల్లా పాఠశాలలు స్వచ్ఛ ఏవం హరిత రేటింగ్ కు ఎంపికయ్యేందుకు ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు.
ఈ రేటింగ్ కోసం నిర్దేశించిన 6 కాంపోనెంట్లను పూర్తిగా అమలు చేసి ప్రతి విభాగంలో నూరు శాతం మార్కులు సాధించేందుకు కృషి చేయాలన్నారు. అందుకు అవసరమైన సహాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. పాఠశాలల్లో విటమిన్ గార్డెన్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కోఆర్డినేటర్ ఆంజనేయులు, ఎంఈఓ ప్రభాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.