13-09-2025 03:20:58 AM
సుమారు 4 లక్షల50 వేలు ఆస్తి నష్టం, మూడు లక్షల నగదు 15 తులాల బంగారం కాపాడిన సిబ్బంది
మద్నూర్, సెప్టెంబర్ 12 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో కొండవార్ రాకేష్ హోల్ సేల్ ఏజెన్సీ దుకాణంలో శుక్రవారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాట్ సర్కూట్ జరిగింది. దీంతో ఒక్కసారిగా దుకాణంలో మంటలు చెలరేగి, నిమిషాల్లోనే మంటలు వ్యాపించి దుకాణం అగ్నికి ఆహుతైంది.
దుకాణంలో మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడడంతో స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్ సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. విషయం తెలుకున్న ఎస్త్స్ర విజయ్ కొండ ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంపై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అగ్నిమాపక సిబ్బందికి, పోలీస్ సిబ్బంది స్థానికులు సహాయం అందించడంతో మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 4 లక్షల 50 వేల వరకు ఆస్తినష్టం జరిగిందని దుకాణం యజమాని కొండవార్ రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అగ్నిప్రమాదంలో అగ్ని మాపక శాఖ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం... రూ.3లక్షల నగదు,15 తులాల బంగారం కాపాడి యజమానికి అందజేశామన్నారు. ఇందులో లీడింగ్ ఫైర్ మెన్ నర్సింలు, సిబ్బంది రాణ ప్రతాప్, హరీష్, రాజును ప్రజలు అభినందించారు.