06-08-2025 12:00:00 AM
ఘట్ కేసర్, ఆగస్టు 5 : ఈనెల 3, 4వ తేదీలలో హన్మకొండలో జరిగిన 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఘట్ కేసర్ మున్సిపల్ అంకుశాపూర్లో ని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, మహేంద్ర హిల్స్ అథ్లెటిక్స్ అకాడమీకి చెందిన బాలికలు తమ అద్భుత ప్రతిభను చాటారు. వివిధ విభాగాలలో మొత్తం 11 పతకాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ స్నేహలత తెలిపారు.
ఈ పోటీల్లో పి. ఉషారాణి 5 కిలోమీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం, 3 కిలో మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సా ధించగా, చైతన్య 5 కిలోమీటర్ల పరుగు పందెంలో రజతం, 10 కిలోమీటర్ల పరుగు పందెంలో మరో రజత పతకంతో మెరిసింది. ఆర్. బేబీ 5 కిలోమీటర్ల పరుగు పందెంలో కాంస్యం, 10 కి లోమీటర్ల పరుగు పందెంలో కాంస్యం గెలుచుకుంది.
డి. సత్య లాంగ్ జంప్లో రజతం, పి. అనూష హై జంప్లో కాంస్యం మరియు కాంస్య పతకం, రేవతి డిస్కస్ త్రోలో రజతం సాధించగా, పూజ జావెలిన్ త్రోలో రజతం, లక్ష్మీ ఉమెన్స్ జావెలిన్ త్రోలో కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా మంగళవారం పతకాలు సాధించి విద్యార్థినులకు ప్రిన్సిపల్ డాక్టర్ శారద పతకాలు వేసి ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ రామలక్ష్మణ్, శేషు కుమారి, అథ్లెటిక్స్ కోచ్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.