నూతనకల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ కె. నరసింహ
నూతనకల్,(విజయక్రాంతి): జిల్లా ఎస్పీ కె. నరసింహ శనివారం నూతనకల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులు, రిసెప్షన్ నిర్వహణ మరియు పరిసరాలను పరిశీలించిన ఆయన, సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రతి కేసుపై తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు భరోసా కల్పించాలని సూచించారు.
నేరస్తులకు శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు చేయాలని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించాలని, రహదారులపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. పండుగల దృష్ట్యా గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా నిఘా కట్టుదిట్టం చేయాలని, 'విజువల్ పోలీసింగ్' ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి సీఐ నరసింహారావు, ఎస్ఐ నాగరాజు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






