01-09-2025 12:56:47 PM
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ
విద్యాలయం పరిసరాలు పరిశుభ్రం చేయించాలని ఆదేశాలు
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha) ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే గదికి వెళ్లారు. ఆహార పదార్థాలు సిద్ధం చేస్తుండగా, పరిశీలించారు. అనంతరం 6 నుంచి 10 తరగతి గదుల్లోని విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధిస్తుండగా, పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు బోదించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలు నిత్యం చదివించాలని, రాయించాలని సాధన చేయించాలని సూచించారు. విద్యాలయం ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఆవరణ అంతా మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించాలని సూచించారు.