24-09-2025 05:24:01 PM
ఐలురాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి
నకిరేకల్,(విజయక్రాంతి): న్యాయవాదుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నకిరేకల్ పట్టణంలో కొండ యాదగిరి ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో వరుసగా న్యాయవాదులపై జరిగే దాడులు కేవలం ఒక వ్యక్తిగత న్యాయవాదిపై జరిగిన దాడి కాదని న్యాయవాద సమాజంపై, కోర్టు గౌరవంపై జరిగిన తీవ్రమైన దాడి అని అన్నారు. న్యాయవాదులపై వరుస దాడులు జరుగుతుండడం చూస్తుంటే న్యాయవాద వృత్తిని ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లోకి నెట్టి వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలు ఈ దాడులను అరికట్టేందుకు ప్రణాళికాబద్ధమైనటువంటి కృషి చేయాలన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడే దోషులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదులు తమ వృత్తిపరమైన విధులు నిర్వర్తించ్చేటప్పుడు వారి భద్రత కోసం న్యాయవాధుల రక్షణ చట్టాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జాప్యం చేస్తే పోరాటం తీవ్ర తరం చేస్తామని స్పష్టం చేశారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తిని కాపాడేందుకు న్యాయ వ్యవస్థ రక్షించేందుకు ఐలు కృషి చేస్తుందని వారు అన్నారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు లో సభ్యులుగా చేరి న్యాయ వ్యవస్థ రక్షణ కోసం జరిపే ఆందోళనలో భాగస్వాములు కావాలని వారు కోరారు.