23-10-2025 01:26:57 AM
హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాం తి) : రాష్ట్రవ్యాప్తంగా అవినీతికి అడ్డాగా మారి న రవాణా శాఖ చెక్పోస్టుల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. చెక్పోస్టుల వద్ద అవినీతిని అరికట్టడం, రవాణా వ్యవస్థను డిజిటల్, పారదర్శకంగా మార్చడ మే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. రాష్ట్రంలోని అన్ని చెక్పోస్టులను వెంటనే మూసేస్తున్నట్టు ప్రకటించింది.
ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ర్టంలోని అన్ని రవాణా శాఖ చెక్ పోస్టులు మూసివేయాలని ఆ శాఖ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశా రు. డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్లు, జిల్లా రవాణా శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డు లు, బారికేడ్లు, సిగ్నేజ్ తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇకపై చెక్ పోస్టుల వద్ద ఎవరూ ఉండరాదని, సిబ్బందిని ఇతర శాఖలకు తిరిగి నియమించాలని స్పష్టం చేశారు. రికార్డులు, ఫర్నిచర్, పరికరాలు వెంటనే జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి తరలించాలని, ఆర్థిక, పరిపాలనా రికార్డులను సమన్వయం చేసి భద్రపరచాలని పేర్కొన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటనలు ఇవ్వడంతో పాటు చెక్ పోస్టు మూసివేతపై సమగ్ర నివేదికను బుధవారం సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని ఆదేశించా రు.
కాగా, గత ఆదివారం తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ అధికా రులు మెరుపు దాడులు నిర్వహించారు. సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్, కామారెడ్డి, కుమ్రంభీం జిల్లాల్లోని చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో రాష్ట్రప్రభుత్వం నిర్ణయం ఆసక్తిగా మారింది.
ఇటీవల ఏసీబీ దాడులు
చెక్పోస్టుల వద్ద జరిగే అవినీతి రవాణా రంగంలో చాలాకాలంగా పెద్ద సమస్యగా ఉం ది. దీనినే ఈ నిర్ణయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15రవాణా శాఖ చెక్పోస్టుల్లో 12చోట్ల ఏసీబీ దాడులు జరిపింది. నిజామాబాద్ జిల్లాలోని సాలూర, నల్లగొండ జిల్లా లోని నాగార్జునసాగర్ చెక్పోస్టుల మీదుగా వచ్చే వాహనాల సంఖ్య తక్కువ.
ఈ రెండింటితోపాటు ఆలంపూర్ను మినహాయించి మిగతా 12 చెక్పోస్టుల్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చెక్పోస్టుల్లో శనివారం రాత్రి అవినీతి నిరోధన శాఖ ఆకస్మిక దాడులు నిర్వహించి రూ.4,18, 800 నగదు స్వాధీనం చేసుకుంది. దీంతో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ నిర్వహిస్తున్న చెక్పోస్టులు వసూళ్ల కేంద్రాలుగా మారాయనే విషయం మారోమారు వెల్లడైంది.
గతంలో ఎదురైన సమస్యలు
చెక్పోస్టు వద్ద పత్రాల తనిఖీ, బరువు పరీక్ష, రసీదు చూపించటం మొదలైన కారణాలతో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చే ది. ఇది సరుకులు సమయానికి చేరకుండా, రవాణా ఖర్చులు పెరగడానికి దారితీసేది. పత్రాలు సరిగా ఉన్నా, కొంతమంది సిబ్బంది లంచం అడిగి వాహనాలను వదిలేవారు. నిరంతరం తనిఖీలు, అనుమానాలు, వాగ్వాదాలు డ్రైవర్లలో భయం, ఆందోళన కలిగిం చేవి. లారీ లేదా బస్సు రోజుకు తక్కువ ట్రిప్పు లు మాత్రమే పూర్తి చేయగలిగేది. దీని వల్ల వ్యాపార సంస్థలకు, ట్రాన్స్పోర్టర్లకు ఆర్థిక నష్టం కలిగేది.
సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు అమలులోకి..
రాష్ర్టంలోని అన్ని రహదారులపై రవాణా చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం సాయంత్రం 5 గంటలలోగా మూసివేతపై పూర్తి నివేదికను ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో తక్షణమే చెక్పోస్టుల కార్యకలాపాలు నిలిపివేయాలని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆకస్మిక ఆదేశాలు జారీ చేశారు.
అవినీతి కేంద్రాలుగా చెక్పోస్టులు
ట్రాన్స్పోర్ట్, పోలీస్, ఇతర సిబ్బంది వాహనాలను ఆపి ‘పత్రాలు చూపించు’ పేరుతో లంచాలు తీసుకునేవారు. చిన్న తప్పులకు కూడా పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం సాధారణం. బరువు మించిపోయిన లారీలను లేదా అనుమతి లేని వాహనాలను డబ్బు తీసుకొని వదిలిపెట్టేవారు. ఇది నేరుగా రోడ్డు ప్రమాదాల కు దారితీస్తుంది. ప్రమాదకర రసాయనా లు, అక్రమ రవాణా సరుకులు చెక్పోస్టుల వద్ద డబ్బు చెల్లించి వదిలించుకునే ఘటనలు నమోదయ్యాయి.
కొంతమంది చెక్పోస్టు సిబ్బంది రోజు లేదా వారం వారీగా వసూళ్లు చేసి పైఅధికారులకు పంచుకునే వ్యవస్థ కూడా ఉన్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. చెక్పోస్టుల వద్ద చోటు చేసుకుంటున్న అవినీతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయానికి గండి పడుతుంది. వాహనదారులకు అవసరం లేని ఇబ్బందులు, ఆలస్యం కావడంతోపాటు రవాణా రంగంపై ప్రజల్లో నమ్మకం తగ్గుతుంది. సరుకు రవాణాలో సమ యం, ఖర్చు పెరుగుతుందని అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి.
నిర్ణయం రెండు నెలల క్రితమే..
జీఎస్టీ అమల్లోకి వచ్చాక చెక్పోస్టుల అవసరం దాదాపుగా లేకుండా పోయిం ది. కేంద్రం సూచనల మేరకు దేశంలోని అనేక రాష్ట్రాలు సంవత్సరాల క్రితమే చెక్పోస్టులను రద్దు చేశాయి. కానీ, మన రాష్ట్రంలోనే నేటికీ కొనసాగుతన్నాయి. ఏడాదిన్నర క్రితమే తెలంగాణలో చెక్పోస్టుల రద్దుకు రవాణాశాఖ నిర్ణయం తీసు కున్నా కొందరు అధికారుల బలమైన ఒత్తిళ్ల కారణంగా ఇన్నాళ్లు ఆ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది.
ఎట్టకేలకు రెండు నెలల క్రితం ఉత్తర్వులు జారీ అయినా అమల్లోకి రాలేదు. చెక్పోస్టుల కారణంగా గతంలో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెక్పోస్టులు ఉన్న ప్పుడు, వాహనదారులు (ప్రత్యేకించి లారీడ్రైవర్లు, గూడ్స్ వాహనాలు, బస్సులు నడిపేవారు) ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దీంతో వాహనదారుల సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ప్రస్తుతం కలిగే లాభాలు
చెక్పోస్టులు లేకుండా వాహనాల స్వేచ్ఛగా రవాణా చేయవచ్చు. వాహనా లు ఎక్కడా ఆగకుండా రాష్ర్ట సరిహద్దులు దాటగలుగుతాయి. సమయం, ఇంధనం రెండూ ఆదా అవుతాయి. ఆన్లైన్ పర్మి ట్లు, ఈవే బిల్లులు లాంటి సిస్టమ్ల ద్వారా వాహనాల నియంత్రణ జరుగుతుంది. డ్రైవర్లు పేపర్ రికార్డులు తీసుకెళ్లాల్సిన అవసరం తగ్గింది. చెక్పోస్టులు లేకుండా లంచాలు, అక్రమ వసూళ్లకు అవకాశం తగ్గుతుంది.
చాలా పనులు (ట్రాన్స్పో ర్ట్ టాక్స్, వాహన అనుమతులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు మొదలైనవి) ఇప్పుడు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి. అందువల్ల చెక్పోస్టుల అవసరం తగ్గింది. చెక్ పోస్టుల వద్ద లైన్లు, ఆలస్యం, కొన్నిసార్లు అనవసర వసూళ్లు జరుగుతుండేవి. చెక్పోస్టులు మూసివేయడం ద్వారా ఈ అవి నీతి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
చెక్పోస్టుల నిర్వహణకు సిబ్బంది, వసతు లు, భద్రత మొదలైన వాటిపై ఖర్చు ఎక్కువగా ఉండేది. వాటిని నిలిపివేస్తే ఖర్చు తగ్గుతుంది. అందువల్ల చెక్పోస్టుల అవసరం లేకుండా వాహనాల నియంత్రణ సాధ్యమవుతోంది. ఇది తెలంగాణలో రవాణా శాఖను ఆధునికీకరించడానికి తీసుకున్న ఒక కీలకమైన అడుగుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.