13-03-2025 01:47:37 AM
ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం మార్చి 12 (విజయక్రాంతి) : జిల్లాలో సామాన్య మానవులకు ఇబ్బంది కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిత్యం వాహన తనిఖీలు చేస్తూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం పోలీస్ హెడ్ క్వార్టర్ లో నిర్వహించారు. ముందుగా గత నెలలో వర్టికల్స్ వారీగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో నమోదైన పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు..పోక్సో కేసులలోని నిందితులకు త్వరతగతిన శిక్ష పడే విధంగా కృషిచేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణా, మట్కా, క్రికెట్ బెట్టింగులు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసీ నేరాల నియంత్రణకు పాటుపడాలన్నారు.
వచ్చే నెలలో జరగనున్న భద్రాచలం శ్రీరామనవమి ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్త్ ప్రణాళికను రూపొందించాలన్నారు..పెట్రోలింగ్,బ్లూ కోలట్స్ వాహనాలతో నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్,ఇల్లందు డిఎస్పీ చంద్రభాను,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామీ, డీసిఆర్బీ సీఐ శ్రీనివాస్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఐటీ సెల్ సీఐ నాగరాజు రెడ్డి, ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.