18 August, 2026 | 5:24 AM

కల్తీ కల్లు నివారణకు కఠిన చర్యలు

13-07-2025 01:25 AM

- ముషీరాబాద్ ఎక్సైజ్ సీఐ రామకృష్ణ

ముషీరాబాద్, జూలై 12 (విజయక్రాంతి) : ఇటీవల కల్తీ కల్లు వల్ల జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని ముషీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కల్తీ కల్లు నివారణకు కఠిన చర్యలు తీసుకుం టున్నామని ముషీరాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు. శనివారం ముషీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 10 కల్లు కంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు చేసి కల్లు శాంపిల్స్ ను సేకరించారు.

ఈ సందర్భంగా సీఐ రామకృష్ణ మాట్లాడుతూ కల్లు కంపౌండ్ల నుంచి సేకరించిన శాంపిల్స్ ను నారాయణగూడలోని ఎక్సైజ్ ల్యాబ్ కు పరీక్షల నిమిత్తం పంపించామని తెలిపారు, కల్లు కంపౌండ్ నిర్వాహ కులు సహజ సిద్ధమైన ప్రకృతి నుంచి వచ్చే చెట్ల కల్లునే విక్రయించాలని  సూచించారు. రసాయనాలను కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు.

కల్లు శాంపిల్లలో అనుమానాలు ఉంటే కంఫౌండ్ ను సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులపై కేసులు నామోదు చేస్తామని హెచ్చరించారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా తమకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఎక్సైజ్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కల్లు కంపౌండ్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ తనిఖీలలో ఎక్సైజ్ ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు..