22-07-2025 12:00:00 AM
వరుస ఘటనలకు నిలయంగా యూనివర్శిటీ
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో ఘటన
మునిపల్లి, జులై 21 : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం వోక్సన్ యూనివర్శిటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలావున్నాయి. వోక్సన్ యూనివర్శిటీలో ఆర్క్ టెక్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్న రుషికేష్(19) ఆదివారం రాత్రి క్యాంపస్ రూమ్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ కు చెందిన రుషికేష్ వోక్సన్ యూనివర్శిటీలో చదువుకుంటూ గత మూడు రోజుల క్రితం ప్రెండ్స్ తో కలిసి విహార యాత్రకు వెళ్లి వచ్చాడు. కాగా ఆత్మహత్యకు ముందు విద్యార్థి సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు తెలిసింది.
అందులో నా అనుకున్న వాళ్లందరూ దూరం అవుతున్నారు..అమ్మా ఐ లవ్ యూ, అక్కా ఐ లవ్ యూ అని సెల్పీ వీడియో తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న విద్యార్థికి సంబందించిన మొబైల్ ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.
రుషికేష్ తాను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరితో పెళ్లి చేసుకోవడం ఓ కారణం అయితే తాను విహార యాత్రకు వెళ్లిన సందర్బంగా తీసుకుపోయిన కారుకు చిన్న ప్రమాదం జరిగిందని తెలిసింది. ఆ కారుకు డ్యామేజీ కట్టివ్వాలని కారు యజమాని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అదే విధంగా తన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో ఏమి చేయాలో తోచక సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వోక్సన్ యూనివర్శిటీలో వరుస ఘటనలు..
కంకోల్ లోని వోక్సన్ యూనివర్శిటీలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. వరుసగా ఆత్మహత్యలు జరగడం కలవరం కలిగిస్తుందని చెప్పవచ్చు. అదే విధంగా గత సంవత్సరం ఇదే నెలలో వోక్సన్ యూనివర్శిటీలో కూలీ పనికి వెళ్లిన కంకోల్ గ్రామానికి చెందిన వ్యక్తి కూడా కనిపించకుండా పోయి చనిపోయిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా గత రెండు మూడు నెలల క్రింత అందులో పనిచేస్తున్న ప్రొఫెసర్ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇలా వరుస ఘటనలు జరుగుతుండడం విద్యార్థులను భయాందోళనలకు గురిచేస్తున్నది. అయినా కూడా యాజమాన్యం యూనివర్శిటీలో పర్యవేక్షణ లేకపోవడం వంటి నిర్లక్ష్య్ం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇప్పటికైనా యాజమాన్యం కళాశాలలో, విద్యార్థులు ఉండే హాస్టళ్లను పర్యవేక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులుకోరుతున్నారు.