08-07-2025 12:44:52 AM
పి.డి.ఎస్.యు రాష్ట్ర సహాయ కార్యదర్శి జి.సురేష్
కామారెడ్డి, జూలై 7 (విజయ క్రాంతి): ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పి డి ఎస్ యు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పి డి ఏస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి జి. సురేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు సంవత్సరాల నుండి విద్యార్థులకు స్కాలర్షిప్ ,ఫీజు రీయింబర్స్మెంట్ ను ప్రభుత్వాలు విడుదల చేయకపోవడం వలన విద్యార్థుల చదువు పూర్తి అయిన తర్వాత పై చదువులకు వెళ్లాలంటే టిసి మెమో బోనఫైడ్ సర్టిఫికెట్స్ అవసరం ఉంటాయి కనుక స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులపై మీరే ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేయడం జరుగుతుందన్నారు.
ఆ ఫీజులు చెల్లించలేక విద్యార్థులు వారి ధృవపత్రాలను కళాశాలలోనే వదిలివేయటం వలన వారు ఉన్నత చదువులకు వెళ్లడం లేదు. దీని ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల అమలు చేయడమే కాకుండా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు బకాయిలను విడుదల చేసి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
2005 విద్య హక్కు చట్టం ప్రకారం ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయకుండా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ధనార్జ నయే ధ్యేయంగా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. దీనిపైన ప్రభుత్వాలు దృష్టి సాధించి ఫీజుల నియంత్రణ చట్టం పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని అన్నారు. గ్రామాల నుండి పట్టణానికి చదువుకోవడానికి వచ్చే పేద విద్యార్థులకు బస్ పాస్ తీసుకోవడం ఇబ్బందిగా ఉన్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం 15% చార్జీలు పెంచడంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమైన విద్యార్థులపై బస్సు పాసులపై 15% చార్జీలు పెంచడం గుదిబండల మారిందన్నారు. ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేసి పోషక ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. పైన పేర్కొన్న డిమాండ్లు నెరవేర్చకపోతే భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల సీఎం క్యాంప్ ఆఫీసులను ముట్టడి చేస్తామని వారు హెచ్చరించారు. రాష్ట్ర నాయకులు రాందాస్, జిల్లా నాయకులు సాయికుమార్, శ్రీకాంత్, రాజేష్, మమత, కావ్య, లావణ్య, మౌనిక సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు.