08-07-2025 12:33:38 AM
- క్రీడాభివృద్దికి రూ.100కోట్లు కేటాయించండి
- ఒలింపిక్స్లో రెండు ఈవెంట్స్ రాష్ట్రంలో నిర్వహించండి..
- క్రీడాకారులకు రైలు ప్రయాణ చార్జీల్లో రాయితీ పునరుద్ధరించండి
- కేంద్ర క్రీడల శాఖ మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వినతి
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): ఖేలో ఇండియా గేమ్స్- తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర క్రీడలు, యువ జన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్. మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తిచేశారు. ఖేలో ఇండియాతో పాటు జాతీయ క్రీడలు, అంతర్జాతీయ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని పరిశీలించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
కేంద్రమంత్రి మన్సుఖ్ ఎల్.మాండవీయను సోమవారం ఢిల్లీ లోని ఆయన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలిశారు. ఖేలో ఇండి యా కింద క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, క్రీడాకారుల శిక్షణ, క్రీడా నిపుణుల ఎంపిక ఇతర కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని కోరారు.
భువనగిరిలో సింథటిక్ అథ్లెటి క్ ట్రాక్, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, రాయగిరిలో స్విమ్మింగ్ పూల్, మహబూబ్నగర్లోని పాలమూరు యూనివర్సిటీలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో మల్టీపర్పస్ హాల్, హైదరాబాద్ హకీంపేట్లో అర్చరీ రేంజ్, సింథటిక్ హాకీ ఫీల్డ్, ఎల్బీ స్టేడియంలో స్క్వాష్ కోర్టు, నేచురల్ ఫుట్బాల్ ఫీల్డ్ అభివృద్ధి, సింథటిక్ ట్రాక్, గచ్చిబౌలిలో హాకీ గ్రౌండ్ నవీకరణ, నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణాలకు రూ.100 కోట్లు కేటాయించాలని కేంద్రమంత్రి మాండవీయను ముఖ్య మంత్రి కోరారు.
రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే క్రీడా వసతుల మెరుగుకు అన్నివిధాలా కృ షి చేస్తోందని..కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం ఇవ్వాలని సీఎం విజ్ఞప్తిచేశారు. 2036లో దేశంలో నిర్వహించే ఒలింపిక్స్లో కనీసం రెండు ఈవెంట్లు తెలంగాణలో నిర్వహించాలని కేంద్రమంత్రిని కోరారు.
జాతీ య స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరి రైలు ప్రయాణాల్లో చార్జీ రాయితీ ఇవ్వాలన్నారు. సమావేశంలో రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్కుమార్రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.