23-10-2025 04:46:04 PM
- దళారుల వ్యవస్థను రూపుమాపేందుకే కపాస్ కిసాన్ యాప్
- కపాస్ కిసాన్ యాప్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
- మండల వ్యవసాయ అధికారి ఎస్ పద్మజ
మునుగోడు (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేంద్రాలలో రైతులు నకిలీ రికార్డులను అందజేస్తే మద్దతు ధర రద్దవుతుందని మండల వ్యవసాయ అధికారిని ఎస్ పద్మజ అన్నారు. గురువారం మండలంలోని ఉకొండి గ్రామంలో కపాస్ కిసాన్ యాపుపై రైతులకు ఏఈఓ నిఖిల్ తో కలిసి అవగాహన కల్పించి మాట్లాడారు. రైతులకు అందించే కపాస్ కిసాన్ యాప్ ఎంతో మేలు చేస్తుందని ఈ సాంకేతిక సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలనీ అన్నారు. ఉత్పత్తులను కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కు సులభంగా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అమ్ముకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
రైతులకు స్లాట్ బుకింగ్, పేమెంట్ ట్రాకింగ్, ఆధార్, భూమి రికార్డుల ద్వారా సులభంగా నమోదు చేసుకోవడం వంటి సదుపాయాలున్నాయని అన్నారు. ఆధార్ నంబర్తో స్వీయ-నమోదుతో పాటు మార్కెట్లో రద్దీని తగ్గించడానికి, క్యూలను నివారించడానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చని అన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా అమ్మకాలు జరుపుకోవడంతో పాటు పేమెంట్ ట్రాకింగ్ వంటి సదుపాయాల ద్వారా లావాదేవీలలో పారదర్శకతను అందిస్తుందన్నారు. ముందుగా ప్లేస్టోర్ నుంచి కపాస్ కిసాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని యాప్లో ఆధార్, భూమి రికార్డులు (పట్టాదారు పాస్బుక్), పంట రకం, విస్తీర్ణం, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాలన్నారు. పత్తి అమ్మాలనుకుంటున్న మార్కెట్ను ఎంచుకుని స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. రైతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పత్తి రైతులు ఉన్నారు.