08-10-2025 12:11:38 AM
కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఏటూరునాగారం,అక్టోబరు7(విజయక్రాంతి):ఏ.టి.సి నైపుణ్య కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఏటూరునాగారం,వాజేడు మండలాలలోని, ప్రభుత్వ ఆర్.ఐ.టి.ఐ (RITI),ఎ.టి.సి (ATC) కేంద్రాలను సందర్శించారు ఈ సందర్భంగా క్యాంపస్లను పరిశీలించి, సిబ్బందితో, శిక్షణార్థులతో మాట్లాడి శిక్షణా కార్యక్రమాల పురోగతి, సదుపాయాలు, ATC పనుల స్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ATC కోసం వచ్చిన మెషినరీ, ఫర్నిచర్, కంప్లీట్ కావలసిన పెండింగ్ పనులు, రిక్రూట్మెంట్ అయిన ట్రైనర్స్ గురించి వివరాలు అడిగి తెలుసు కున్నారు. విద్యార్థులకు అన్నివసతులు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ నాణ్యత,వృత్తి విద్యా సదుపాయాల విస్తరణ, విద్యార్థుల ప్రాక్టికల్ నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. విద్యార్థుల శిక్షణా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణా విధానాలను నవీకరించాలని అధికారులను ఇన్స్ట్రక్టర్లను సూచించారు. ప్రస్తుత ఏ.టి.సి సెంటర్ ద్వారా అందించే నైపుణ్య శిక్షణ చాలా ప్రాముఖ్యమైందని అన్నారు. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చే దిశగా పిల్లలు బాగా చదువుకొని మన జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలని కలెక్టర్ సూచించారు.
పక్కాగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలి
కలెక్టర్ దివాకర టి.ఎస్, అదనపు కలెక్టర్ సి.హెచ్. మహేందర్
ఏటూరునాగారం,అక్టోబరు7(విజయక్రాంతి):ములుగు జిల్లాలో పండించిన ప్రతి నాణ్యమైన గింజను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పక్కాగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అన్నారు. మంగళవారం ఏటూరునాగారం రైతు వేదికలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపురం తాడ్వాయి, గోవిందరావుపేట పరిధిలోని వివిధ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు నిర్వహించిన శిక్షణ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ (వానకాలం) ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయిలో నిబంధనల ప్రకారం కట్టుదిట్టంగా జరగాలని, జిల్లాలో దాదాపు 1.5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా 175 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిధిలో ఉన్న రైతుల వివరాలు, రైతులు సాగు చేసిన భూ విస్తీర్ణం వివరాలు, వచ్చే పంట దిగుబడి వివరాలు ముందస్తుగా తెలుసుకోవాలని, షెడ్యూల్ ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చే విధంగా చూడాలని కలెక్టర్ అన్నారు.
జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయిలో 175 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకొని 17 కంటే తక్కువ తేమ శాతంతో కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని, రైతుల ధాన్యం నాణ్యతను వ్యవసాయ విస్తరణ అధికారులు పరిశీలించి ధ్రువీకరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవసరమైన మేర ప్యాడి క్లీనర్ లను ఏర్పాటు చేశామని, ధాన్యాన్ని తప్పనిసరిగా ప్యాడి క్లీనర్లతో శుభ్రం చేసిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ట్రక్ షీట్ అందించాలని, రైస్ మిల్లుల వద్ద ఎటువంటి కటింగ్ విధించడానికి వీలులేదని కలెక్టర్ స్పష్టం చేశారు.